ఇటీవలే వందేళ్లు పూర్తి చేసుకున్న భారత మాజీ క్రికెటర్ మృతి

  • మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ వసంత్ రాయిజీ మృతి
  • 1940లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన రాయిజీ
  • సీకే నాయుడు, విజయ్ మర్చంట్ వంటి వారితో డ్రస్సింగ్ రూమ్ పంచుకున్న చరిత్ర
భారత క్రికెట్ రంగం ఈరోజు ఆవేదనలో మునిగిపోయింది. మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ వసంత్ రాయిజీ  ఈ ఉదయం ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు. ఈ ఏడాది జనవరిలో ఆయన 100 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన 100వ పుట్టినరోజు వేడుకలకు సచిన్, స్టీవ్ వా కూడా హాజరయ్యారు.

1940లలో వసంత్ రాయిజీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారు. 9 మ్యాచుల్లో 277 పరుగులు చేశారు. ఆయన అత్యధిక స్కోరు 68 పరుగులు. బొంబాయి జింఖానాలో ఇండియా తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు ఆయన వయసు 13 ఏళ్లు. అంటే ప్రారంభం నుంచి ఇప్పటి వరకు భారత క్రికెట్ ప్రయాణాన్ని ఆయన చూశారు. 1939లో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశారు. ముంబై, బరోడా జట్లకు ఆడారు. క్రికెట్ దిగ్గజాలైన సీకే నాయుడు, విజయ్ హజారే, విజయ్ మర్చంట్, లాలా అమర్ నాథ్ వంటి వారితో కలిసి డ్రస్సింగ్ రూమ్ ను పంచుకున్నారు. ఆయన మరణం పట్ల బీసీసీఐతో పాటు ప్రముఖ క్రికెటర్లు సంతాపం ప్రకటించారు.

Vasanth Raiji
Cricketer
India

More Telugu News